సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై మాట్లాడేందుకు కూటమి నేతలు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి సవాల్ విసిరారు. ఇందాపూర్, హెరిటేజ్ అక్రమ సంబంధంపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అప్పుల విషయమయినా చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. చట్టసభలోనైనా, బయటైనా చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి కాకాణి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నెయ్యి కాంట్రాక్టు కోసం ఏకంగా వెంకటేశ్వర స్వామికే చంద్రబాబు అపఖ్యాతి తెచ్చారు. ఇందాపూర్, హెరిటేజ్ గురించి అడిగితే కూటమి నేతలు భయపడుతున్నారు. ఇందాపూర్ డైరీకి అత్యధిక ధరకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?. దీనిపై చర్చించాలని అడిగితే శాసనమండలిలో అవకాశం ఇవ్వలేదు. మా పార్టీకి నుండి అమ్ముడుపోయిన ఇద్దరు ఎమ్మెల్సీలతో వాయిదా తీర్మానం ఇప్పించారు. ఇది నారా లోకేష్ దివాలాకోరు తనానికి నిదర్శనం. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ డైరీ దేవుని సొమ్ము దోచుకుంది. రూ.321ల నెయ్యిని రూ. 658 కొనుగోలు చేయటం దోపిడీ కాదా?.
దేవుని సొమ్మును కూడా చంద్రబాబు ఇంత దుర్మార్గంగా దోచుకుంటారా?. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల కుట్రలు చేస్తున్నారు. సున్నితమైన విషయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాటకాలు వేస్తున్నారు. లడ్డూలో బాత్రూమ్ యాసిడ్ని కలిపారంటూ పిచ్చి మాటలు మాట్లాడారు. ఎల్లోమీడియాలో వార్తలు రాయించి, దాని ప్రకారం చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగటం సరికాదు. కుట్రలన్నీ బయట పడటంతో కుడితిలో పడిన బల్లిలాగా చంద్రబాబు పరిస్థితి మారింది. మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పును 20నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు అప్పుల్లో ఆల్ టైం రికార్డు సృష్టించారు. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో లెక్క చెప్పటం లేదు.
22A భూముల విషయమై చర్చకు వచ్చే దమ్ముందా?. 2014-19 మధ్య రైతుల భూమిని 22Aలో పెట్టిందే చంద్రబాబు. ఆ జీవోలన్నీ జనం చూశారు. వైఎస్ జగన్ వచ్చాకే 22A నుంచి రైతులను బయటకు తెచ్చారు. జగన్ తెచ్చిన ఆ చరిత్రాత్మక నిర్ణయంతో 15 లక్షలకు పైగా రైతులకు మేలు చేశారు. చుక్కల భూములు, షరతుల భూములు, ఈనాం భూములకు కూడా మేలు చేసింది జగనే. దీనిపై అసెంబ్లీలో మాట్లాడటానికి కూటమి నేతలు భయపడున్నారు. చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు, మ్యానిపులేషన్ మాత్రమే అని ఘాటు విమర్శలు చేశారు.


