సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు.
ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్పై దానంను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. సుమారు రెండు గంటల పాటు విచారించినట్టు తెలిసింది. మరోవైపు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే, దానం అనర్హత పిటిషన్ విచారణకు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి తన లాయర్లను పంపించారు. ఈరోజు విచారణకు సంబంధించి ఎవిడెన్స్ అఫిడవిట్ను లాయర్తో పంపించారు. కాగా, తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎవిడెన్స్ అఫిడవిట్లో దానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా 2024 పోటీ చేసిన డాక్యుమెంట్స్ పొందుపరిచారు. తాను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరడంలో స్పీకర్ అనుమతి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ఫిబ్రవరి 18న విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. ఇందు కోసం కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ రమన్నారు. దానం నాగేందర్ను స్పీకర్ సస్పెండ్ చేస్తాడని నమ్ముతున్నాం. దానం బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకి వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లు స్పీకర్కు ఇస్తాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు విచారణలో భాగంగా కాసేపటి క్రితమే దానం నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.


