సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో, కామారెడ్డి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


