ఏడాదిలోనే పట్టుబడిన ఐఎం ఉగ్రవాదులు
2016లో ఉరిశిక్ష వేసిన ఎన్ఐఏ న్యాయస్థానం
న్యాయ ప్రక్రియలతో ఇప్పటికీ అమలు కాని వైనం
సాక్షి, హైదరాబాద్: సొత్తు సంబంధిత నేరాల్లో కోల్పోయింది రికవరీ అయినప్పుడు... బాడీలీ అఫెన్సులతో పాటు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో నిందితులు దోషులుగా నిరూపితమై, వారికి పడిన శిక్ష అమలైతేనే బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరిగినట్లు. 13 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో అశువులుబాసిన, క్షతగాత్రులుగా మారిన కుటుంబాలకు ఇప్పటికీ ఈ న్యాయం దక్కలేదు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడినా...న్యాయ ప్రక్రియ నేపథ్యంలో పదేళ్లుగా అది అమలు కాకపోవడమే దీనికి కారణం.
ఏడాదిలోనే పూర్తి అయిన అరెస్టులు...
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగాయి. అక్కడి 107 బస్టాప్లో మొదటి బాంబు సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద రెండోది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. ఈ దుశ్చర్యలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది చనిపోగా... దాదాపు 65 మంది క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తేలింది.
ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక నిందితుడు యాసీన్ భత్కల్, అతడి ప్రధాన అనుచరుడు హడ్డీలను 2013 ఆగస్టు 29న బీహార్లోని రక్సుల్ ప్రాంతంలో, ఎజాజ్ షేక్ను అదే ఏడాది సెపె్టంబర్ 6న ఉత్తరప్రదేశ్లోని పశి్చమ ప్రాంతమైన సహరంగ్పూర్ రైల్వే స్టేషన్లో, జియా ఉర్ రెహా్మన్ను రాజస్థాన్లోని అజీ్మర్ రైల్వేస్టేషన్లో 2014 మార్చ్ 22న, తెహసీన్ అక్తర్ను పశి్చమ బెంగాల్లోని కాఖర్ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నారు.
ఆరేళ్లలో పూర్తి అయిన ఈ కేసుల విచారణ
యాసీన్ భత్కల్ అరెస్టు తర్వాత మాత్రమే ఎజాజ్ షేక్కు దిల్సుఖ్నగర్ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. దీనికి ముందే అతడిని ఢిల్లీ స్పెషల్ సెల్ మరో కేసులో అరెస్టు చూపింది. ఆపై వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్కు తీసుకువచ్చి దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసుల్లో అరెస్టు చూపించింది. యాసీన్, హడ్డీలపై 2013 మార్చి 14న, రియాజ్, వఖాస్ తెహసీన్లపై 2014 సెపె్టంబర్ 16, ఎజాజ్ షేక్పై 2015 జూన్ ఆరున అభియోగపత్రాలు దాఖలు చేసింది.
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వీరి విచారణ జరిగింది. 2016 నవంబర్ 21న విచారణ పూర్తి కాగా... డిసెంబర్ 13న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురినీ దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు ఇచి్చంది. అదే నెల 19న ఈ దోషులకు ఉరి శిక్ష విధించినట్లు కోర్టు ప్రకటించింది. ఈ శిక్షను 2025 ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు సైతం ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.
అమలు వరకు సుదీర్ఘ ప్రక్రియ...
ఉగ్రవాదులకు పడిన ఈ ఉరి శిక్ష అమలుకు ముందు సుదీర్ఘ ప్రక్రియే ఉంటుంది. ఇప్పటికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఇప్పుడు దోషులు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశమూ ఉంది. సుప్రీం కోర్టులోనూ వీరికి చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. దోషి లేదా వారి తరఫు వారో ఈ పిటిషన్లను దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణశిక్ష ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఐఎం ఉగ్రవాదులు వివిధ రాష్ట్రాల్లోని జైళ్లల్లో ఉన్నారు. అక్కడ నమోదైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.


