న్యూఢిల్లీ: అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై ఏర్పడిన సందిగ్ధతకు పంచాంగ నిపుణులు స్పష్టతనిచ్చారు. శ్రావణ మాస పూర్ణిమ తిథి నాడు జరుపుకొనే ఈ పండుగ 2026లో ఆగస్టు 27న లేక 28నా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి 2026 ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికం కావడంతో, రక్షాబంధన్ పర్వదినాన్ని ఆగస్టు 28, 2026 నాడు జరుపుకోవాలని వేద పండితులు, పురోహితులు నిర్ణయించారు.
రాఖీ కట్టే శుభ ముహూర్తం
ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన శుభ ముహూర్తంగా నిర్ణయించారు. అలాగే, మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు.
చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా?
రక్షాబంధన్ రోజే ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. కన్యారాశిలో సంభవించే ఈ గ్రహణం ఉదయం 8:04 గంటల నుంచి ఉదయం 11:22 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి దోషాలు ఉండవని పండితులు స్పష్టం చేశారు. ఎటువంటి ఆందోళన లేకుండా నిర్దేశిత శుభ ముహూర్తాల్లో రాఖీ కట్టవచ్చని తెలిపారు.
పౌరాణిక ప్రాశస్త్యం
రక్షాబంధన్ వెనుక పలు పౌరాణిక, చారిత్రక గాథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి చేతికి గాయమై రక్తస్రావం జరుగుతున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టడం, అందుకు ప్రతిగా వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు ఆమెను రక్షించాడని చెబుతారు. అలాగే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి విష్ణుమూర్తిని పాతాళం నుంచి వెనక్కి తీసుకురావడం, మేవార్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపి సహాయం కోరడం వంటి కథలు ఈ పండుగ విశిష్టతను తెలియజేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 35 వేల అడుగుల ఎత్తులో డిస్నీ సందడి.. రియాద్ ఎయిర్ భారీ ప్లాన్!


