హైదరాబాద్: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఓ యువతిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఇనార్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో పనిచేస్తున్న భారతిముఖి(26), పూడా అశోక్ అలోన్(26) ఈ నెల 16న మధ్యాహ్నం సమీపంలోని ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో భోజనం చేశారు.
తిరిగి వస్తూ ఇనార్బిట్మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా సంజుస్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతిముఖిని బలంగా ఢీ కొట్టాడు. ఆమె తలకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను అదే వాహనంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.


