కేతన్‌ అగర్వాల్‌ హత్య.. సోనమ్‌ రఘువంశీయే సియా ఇన్స్పిరేషన్‌! | Pune Woman Who Pushed Fiance Off Fort Took Inspiration From Meghalaya Honeymoon Murder Case, Check More Details | Sakshi
Sakshi News home page

కేతన్‌ అగర్వాల్‌ హత్య.. సోనమ్‌ రఘువంశీయే సియా ఇన్స్పిరేషన్‌!

Jul 7 2026 8:04 AM | Updated on Jul 7 2026 9:56 AM

Siya Goyal Researched Learnt From Sonam Raghuvanshi Mistakes

పూణే: సాధారణంగా మీకు స్ఫూర్తి ఎవరు? అని అడిగితే కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు లేదా సినీ ప్రముఖుల పేర్లు చెబుతారు. అయితే తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసి చంపిన సియా గోయల్‌కు స్ఫూర్తిగా నిలిచింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీ అని పూణే పోలీసులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తన కాబోయే భర్త కేతన్‌ను లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసి హత్య చేసిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పథకం వెనుక విస్తుపోయే నిజాలు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. గతంలో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీని ఆదర్శంగా తీసుకుని ఈ నేరానికి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.

పెళ్లైన కొద్ది రోజులకే హనీమూన్ పేరుతో భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్ రఘువంశీ, సోహ్రా జలపాతం సమీపంలో ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో జరిగిన తప్పులను తాను పునరావృతం చేయకూడదని సియా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సోనమ్ తన భర్తపై ఆయుధాలతో దాడి చేయడం వల్ల శరీరంపై గాయాలు కనిపించాయని, అదే పోలీసులకు కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా, కేతన్‌ను లోహ్‌గఢ్ కోటపై నుంచి లోయలోకి తోసేయడం ద్వారా ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించాలని సియా ప్రయత్నించింది. ఒక్కరితో అది సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతో ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఇద్దరూ ఒకేసారి కేతన్‌ను లోయలోకి తోసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసును ఛేదించడం పూణే పోలీసులకు అంత సులభం కాలేదు. నిందితులు సృష్టించిన తప్పుడు కథనాలు, తాము సంఘటనా స్థలంలో లేమనే వాదనలు, ఇతర తప్పుడు ఆధారాలను పోలీసులు క్రమంగా ఛేదించారు. సియా గోయల్ మనస్తత్వాన్ని లోతుగా విశ్లేషిస్తూ, నిరంతర విచారణ నిర్వహించిన తర్వాతే నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. వారి వాంగ్మూలాల ఆధారంగా ఇతర కీలక భౌతిక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.

కేతన్ పడిన ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనది కాకపోవడం, కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలు, అలాగే పోలీసులు జరిపిన సుదీర్ఘ విచారణ ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించాయి.

సియా గోయల్ మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆమె ఇంటర్నెట్‌లో విస్తృతంగా శోధించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పోలీసు కస్టడీలో మహిళలను కొడతారా?, మహిళా ఖైదీలకు ఉన్న హక్కులు ఏమిటి? వంటి అంశాలపై కూడా ముందుగానే గూగుల్‌లో వెతికిని డిజిటల్ ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇంత ఘోరమైన నేరానికి పాల్పడినప్పటికీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ కేసు తన కుమారుడి హత్యను గుర్తుకు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం సియా గోయల్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రెండో మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement