ఢిల్లీ: తీహార్ జైల్లో ఉమర్ ఖలీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితుడు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్పై తోటి ఖైదీలు మూకుమ్మడి దాడి చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఉమర్ ఖలీపై దాడి జరిగిందంటూ పలు సోషల్ మీడియా పోస్టులు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా దాడి జరిగిందా? దాడి చేసిన వారు ఎవరు? దాడి చేయడానికి కారణం ఏమిటి? దాడి తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వంటి వివరాలపై స్పష్టత కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదే కేసులో
ఇదే కేసులో జనవరి 5న సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆరేళ్ల క్రితం దేశ రాజధాని భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ తిరస్కరించింది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాములుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది.
11 షరతులు విధించిన కోర్టు
ఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.
వీళ్లది కీలక పాత్ర..
‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.
గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..
‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు.
ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది.
సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.


