టీ20 వరల్డ్కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
అనూహ్య రీతిలో..
దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన సిరాజ్ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్కప్ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్ విజయంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు.
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.
టీమిండియాకు శుభవార్త
ఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన సుందర్ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.
అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.
కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.
చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!


