న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఛాతీ సంబంధిత నిపుణుని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. సోనియా గాంధీ గత కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో, ఆమె ఆస్పత్రిలో చేరారని వైద్యులు పేర్కొన్నారు. ఇది సాధారణ పరీక్షల కోసమేనని వారు స్పష్టం చేశారు. గత డిసెంబర్లో సోనియా గాంధీ తన 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. వయసు రీత్యా వస్తున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె అడపాదడపా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇది కూడా చదవండి: ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్


