కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే చీఫ్ విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సాక్షిగా ఆయన్ని ఇదివరకే దర్యాప్తు సంస్థ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు.
గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని.. విజయ్ ఆలస్యంగా రావడమూ ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే.. విజయ్పై నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీం కోర్టు.
కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సీబీఐ.. జనవరి 12వ తేదీన విజయ్ను ఢిల్లీ హెడ్క్వార్టర్స్లో ఆరు గంటలపాటు విచారించింది. మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సభ ఏర్పాట్లతో మొదలు.. పలు విషయాలు అందులో ఉన్నాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే..
మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని.. ఇందుకు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ విజయ్కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంది. ఇవాళ్టి విచారణ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు ఉన్నారు. ఇవాళ్టితో విచారణ ముగిస్తారా? లేదంటే మళ్లీ పిలుస్తారా? చూడాలి.


