పాక్స్‌ సిలికాలోకి భారత్‌  | India Signs Pax Silica Agreement At AI Impact Summit 2026 | Sakshi
Sakshi News home page

పాక్స్‌ సిలికాలోకి భారత్‌ 

Feb 21 2026 4:07 AM | Updated on Feb 21 2026 4:07 AM

India Signs Pax Silica Agreement At AI Impact Summit 2026

అరుదైన ఖనిజాల లభ్యతే లక్ష్యం 

ఏఐ సమర్థ వినియోగం కూడా 

ఏకస్వామ్యానికి చెల్లు: అమెరికా 

చైనానుద్దేశించి కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్‌సిలికా కూటమిలో భారత్‌ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్‌ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ పాల్గొన్నారు. 

అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్‌ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్‌బర్గ్‌ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. 

ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. 

కూటమి మరింత బలోపేతం: గోర్‌ 
21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్‌సిలికా కూటమి పునర్‌ నిర్వచిస్తుందని గోర్‌ జోస్యం చెప్పారు. భారత్‌ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్‌ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్‌ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్‌ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు.

 ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్‌కూ బాగా తెలుసు’’అని గోర్‌ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్‌సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. 

కీలక నిర్ణయం: వైష్ణవ్‌ 
పాక్స్‌సిలికా కూటమిలో చేరికను భారత్‌ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్‌ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్‌ రంగంలో భారత్‌ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్‌ చిప్స్‌ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్‌ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్‌కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు.  

ఏమిటీ పాక్స్‌సిలికా? 
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్‌ చిప్స్‌ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా.

 గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్‌లో పాక్స్‌సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్‌ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్‌కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. 

అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్‌ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్‌లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్‌సిలికా కూటమిలో చేరేలా భారత్‌ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్‌ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్‌ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement