తన గ్లోబల్ టారిఫ్ (ప్రపంచ సుంకాల) విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర నిరాశపరిచిందని ఆయన అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని ట్రంప్ ఆరోపించారు. కాగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ట్రంప్ తన ఇష్టారీతిన ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక చైనా, మెక్సికో, కెనడాతో పాటు భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 50% వరకు సుంకాలు విధించారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని చిన్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలవరించింది.
ధర్మాసనంలో మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్ సుంకాలను వ్యతిరేకించగా.. ముగ్గురు మాత్రమే సమర్ధించారు. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. "ప్రెసిండెంట్ అత్యవసర అధికారాలను అడ్డుకుని, సుంకాల విధింపును నిలిపివేసిన కొందరు కోర్టు సభ్యులను చూసి సిగ్గుపడుతున్నాను. కొందరు న్యాయమూర్తులు దేశీయ ప్రయోజనాల కంటే విదేశీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అటువంటి వారి ప్రభావంతోనే ఈ నిర్ణయం వెలువడింది. ఈ తీర్పుతో విదేశీ దేశాలు చాలా సంతోషంగా ఉంటాయి. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నా వద్ద ప్లాన్ బి కూడా ఉందని పేర్కొన్నారు. కాగా సెక్షన్ 232 లేదా సెక్షన్ 301 వంటి ఇతర వాణిజ్య చట్టాల ద్వారా మళ్ళీ సుంకాలను అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


