అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు పదేళ్ల తర్వాత చైనా టూర్కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ట్రంప్ ఈ ఏడాది మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆయన భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చితిని, తైవాన్ చుట్టూ ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.
తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ ఈ పర్యటన గురించి మాట్లాడారు. నేను ఏప్రిల్లో చైనాకు వెళ్తున్నాను. ఈ పర్యటన అద్భుతంగా ఉండనుంది అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చివరిసారిగా 2017లో అధ్యక్ష హోదాలో చైనా పర్యటనకు వెళ్లారు.
కాగా శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల పెంపు పిటిషన్ను కొట్టేసింది. ఈ తీర్పు చైనాకు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా యూఎస్-చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. చైనాపై ట్రంప్ సర్కార్ అడ్డగోలుగా టారిఫ్లు వేయడం వాటికి ప్రతిగా బీజింగ్ సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగింది.
మరోవైపు తైవాన్ విషయంలో ఇరు దేశాల మధ్య తైవాన్ విషయంలో కూడా వివాదం కొనసాగుతోంది. తైవాన్ తమ భూభాగమేనని వాదించే చైనా, అమెరికా చేస్తున్న ఆయుధ విక్రయాలపై ఆగ్రహంగా ఉంది. ఇటీవలే అమెరికా 11 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందానికి ఆమోదం తెలపడం జిన్పింగ్కు మింగుడుపడటం లేదు.
తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఈ ఉద్రిక్తల మద్య ట్రంప్-జిన్పింగ్ భేటికి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ ఏడాది చివరిలో జిన్పింగ్ కూడా అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశముంది.


