న్యూయార్క్: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పలు దేశాలపై ఇష్టారీతిన సుంకాలు పెంచుకుంటూ పోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాకిస్తూ కీలక తీర్పును వెల్లడించింది. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ లేదని ప్రకటించింది. ఫలితంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల పెంపు పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు తొమ్మిది మంది కూడని అమెరికా సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది. ముగ్గురు జడ్జిలు మాత్రం టారిఫ్లను సమర్ధించగా, అత్యధిక శాతం 6 మంది జడ్జిలు వ్యతిరేకించారు.
సుంకాలు విధించే అధికారం దేశాధ్యక్షుడికి లేదని వారు స్పష్టం చేశారు. సుంకాలు విధించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటివరకూ వసూలు చేసిన వందల బిలియన్ డాలర్ల సుంకాలు దిగుమతి దారులకు ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది. భారత్పై విధించిన 18 శాతం సుంకాలు కూడా అనధికారమేనని సుప్రీం పేర్కొంది.
ఫలితంగా ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. భారీగా సుంకాలు పెంచుతూ ట్రంప్ దూకుడుకు ఈ తీర్పుతో చెంపదెబ్బ తగిలింది. భారత్పై 18 శాతం సుంకాలు విదించిన ట్రంప్.. చాలా దేశాలపై అధిక శాతం సుంకాలు విధిస్తూ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు. తాజా అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ వైఖరి సరైనది కాదనే విషయం తేటతెల్లమైంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
ట్రంప్ అసంతృప్తి..
సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు సరికాదంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన వద్ద ప్లాన్-బీ కూడా ఉందంటూ పరోక్షంగా తన వైఖరి మారదనే సంకేతాలిచ్చారు ట్రంప్.. తన అమలు చేయబోయే ప్లాన్ బి అనేది త్వరలోనే చూస్తారంటూ ట్రంప్ స్పష్టం చేశారు.


