భారత్, దక్షిణాఫ్రికా పోరులో ఆసక్తికర వైరం
వేర్వేరు శిబిరాల్లో అన్నదమ్ములు
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్, గత రన్నరప్ మధ్య రేపు జరిగే ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్పై అందరి దృష్టీ నిలిచింది. తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఇరు జట్లు తమ గ్రూప్లలో అన్ని మ్యాచ్లూ గెలిచి టాపర్లుగా ముందంజ వేశాయి. అయితే మైదానం లోపలే కాకుండా బౌండరీ బయట కూడా ఒక ‘పోరు’ ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్ల సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న సొంత అన్నదమ్ములు ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ ప్రత్యర్థులుగా తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు.
రేపు మ్యాచ్ జరిగే సమయంలో వేర్వేరు డగౌట్లలో వీరు కనిపించనున్నారు. మోర్నీ గత కొంతకాలంగా భారత బౌలింగ్ కోచ్గా పని చేస్తుండగా, ఈ టోర్నీ కోసమే ఆల్బీని ‘ప్రత్యేక సలహాదారుడు’గా దక్షిణాఫ్రికా తీసుకుంది. శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్ సందర్భంగా ఆల్బీ, మోర్నీ గ్రౌండ్లోకి వచ్చినా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు! ‘ఇప్పటి పరిస్థితుల్లో మా గురించి కాదు. మా అమ్మ గురించే అసలు ఆలోచన. ఆమెనే మా ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతోంది’ అని ఆల్బీ వెల్లడించాడు.
పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన ఆల్బీ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టి20 మ్యాచ్లు ఆడగా... స్ట్రయిక్ పేస్ బౌలర్గా గుర్తింపు పొందిన మోర్నీ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున స్యామ్ కరన్ బరిలోకి దిగగా... అతని సోదరుడు బెన్ కరన్ జింబాబ్వే జట్టులో ఉన్నాడు.


