టీ20 ప్రపంచకప్ 2026 చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా పసికూన ఒమన్పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్ను ఆలౌట్ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇదివరకే సూపర్-8కి చేరాయి. సూపర్-8 మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.
ఒమన్ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్ జంపా (3.2-0-21-4), గ్లెన్ మ్యాక్స్వెల్ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్ బార్ట్లెట్ (4-0-27-2), నాథన్ ఇల్లిస్ (2-0-14-1), మార్కస్ స్టోయినిస్ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు.
ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ (17), హమ్మద్ మీర్జా (16), కరణ్ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్(32), ఇంగ్లిస్ (12 నాటౌట్) సహకరించారు. హెడ్ వికెట్ షకీల్ అహ్మద్కు దక్కింది.


