అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్‌ | His Spell Broke Back of Our Chase Vs India: Namibia Skipper Erasmus | Sakshi
Sakshi News home page

IND vs NAM: అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్‌

Feb 13 2026 1:55 PM | Updated on Feb 13 2026 2:08 PM

His Spell Broke Back of Our Chase Vs India: Namibia Skipper Erasmus

పసికూన నమీబియాకు టీ20 వరల్డ్‌కప్‌-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్‌తో తలపడ్డ ఎరాస్మస్‌ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అతడు మా ‘వెన్ను’ విరిచాడు
డెత్‌ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్‌ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా‌ విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్‌ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.

ఈ మేరకు.. ‘‘పవర్‌ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్‌ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.

అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్‌ చక్రవర్తి వేసిన స్పెల్‌ మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్‌ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.

మా బ్యాటింగ్‌లో ఫైర్‌ పవర్‌ ఉంది
ఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్‌లో ఫైర్‌ పవర్‌ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్‌ కూడా ఇక్కడే ఆడాము. పిచ్‌లో ఎలాంటి మార్పూ లేదు.

అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన​ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ చెప్పుకొచ్చాడు.

వరుణ్‌ అద్భుత స్పెల్‌
కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ ఎరాస్మస్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్‌ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ లారెన్‌ స్టీన్‌కాంప్‌ (29), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జాన్‌ నికోల్‌ లాఫ్టీ-ఈటన్‌ (13)లతో పాటు.. జేజే స్మిత్‌ (0)లను వరుణ్‌ అవుట్‌ చేశాడు.

 

కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎరాస్మస్‌ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.  

చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement