IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్‌ గొడవ.. తప్పెవరిది? | Erasmus Fumes At Tucker Dead Ball Call Did Umpire Get It Wrong Explained | Sakshi
Sakshi News home page

IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్‌ గొడవ.. తప్పెవరిది?

Feb 13 2026 12:07 PM | Updated on Feb 13 2026 12:29 PM

Erasmus Fumes At Tucker Dead Ball Call Did Umpire Get It Wrong Explained

టీమిండియాతో మ్యాచ్‌ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్‌ ఆవేదన ‍వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మాకు ఆ అవకాశమే లేదు
తమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్‌ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్‌లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.

అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్‌ ప్రాక్టీస్‌ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్‌ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్‌ సందర్భంగానూ ఎరాస్మస్‌ బౌలింగ్‌ శైలి చర్చకు దారి తీసింది.

‘డెడ్‌ బాల్‌’
బౌలింగ్‌ క్రీజ్‌ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్‌ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్‌ తొలి ఓవర్లో దీనిని అంపైర్‌ టకర్‌ ‘డెడ్‌ బాల్‌’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.

అయితే, ఎరాస్మస్‌ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్‌ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్‌ వెనక నుంచి బౌలింగ్‌ చేసిన ఎరాస్మస్‌ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్‌ చేయడంతో సమస్య రాలేదు.

నాలుగు కీలక వికెట్లు
ఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్‌ ఆఫ్‌ స్పిన్‌...రౌండ్‌ ఆర్మ్‌...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్‌ఫ్యూజన్‌కు గురి చేసిన ఎరాస్మస్‌ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61), తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్‌ పటేల్‌ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.

కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ ఎరాస్మస్‌ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. 

చదవండి: వారిద్ద‌రూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అద‌ర‌గొట్టారు: సూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement