భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.
ఈ సమ్మిట్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.
హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది.


