ఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకంపై తేల్చాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇవాళ (ఫిబ్రవరి 5, గురువారం) విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలన్న ధర్మాసనం.. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.
ఈ ఆలస్యం వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందన్న సుప్రీంకోర్టు.. యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదని పేర్కొంది. ‘‘రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే.. త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని సుప్రీంకోర్టు హెచ్చరించింది.


