అది రాయల్‌ బెంగాల్‌ 'టైగర్‌'! | Royal Bengal tiger in Yadadri Bhuvanagiri district | Sakshi
Sakshi News home page

అది రాయల్‌ బెంగాల్‌ 'టైగర్‌'!

Feb 5 2026 4:36 AM | Updated on Feb 5 2026 4:36 AM

Royal Bengal tiger in Yadadri Bhuvanagiri district

అటవీ శాఖ అధికారుల గుర్తింపు

సాక్షి, యాదాద్రి/హైదరాబాద్‌: ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు, అటవీ శాఖ అధికా రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల, కామా రెడ్డి, సిద్దిపేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. 

పెద్ద పులి ఇప్పటి వరకు మనుషులకు ఎక్కడా ఎలాంటి హాని తలపెట్టలేదు. ఆకలి తీర్చుకోవడానికి పశువులను చంపి తింటోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఆవును పులి చంపేసింది. పులిని సురక్షితంగా బంధించడానికి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్, దత్తాయపల్లి, బసంతాపూర్, శ్రీనివాస్‌పురం, శారాజిపేటల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 

పులి సంచారాన్ని గుర్తించడానికి డ్రోన్‌ కెమెరాలను వాడుతున్నారు. అయితే గుట్టల్లో పొదలు అడ్డుగా వస్తున్నాయి. మత్తు ప్రయోగంతో పులిని బంధించే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దపులి కదలికలు అర్థం కావడం లేదని అటవీశాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కల్యాణ్‌ బాబ్జీరాం చెప్పారు. రోజూ రాత్రి 10 నుంచి 15 కిలోమీటర్లు తిరుగుతోందన్నారు. శాటిలైట్‌ సెర్చింగ్‌ కోసం కేంద్రం నుంచి అనుమతి రావాలని పేర్కొన్నారు.

పులి కదలికలపై నిరంతర అప్రమత్తత
సిద్దిపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో రెండు వారాలుగా పెద్దపులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్‌) డాక్టర్‌ సి.సువర్ణ అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది. ఇటీవల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. 

తాజా సమావేశంలో పులి కదలికలపై నిరంతర సమీక్షలు చేపట్టి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను పీసీసీఎఫ్‌ సువర్ణ ఆదేశించారు. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రతినిధులు రమేష్, హైటికోస్‌ (హైదరాబాద్‌ కన్సర్వేషన్‌ సొసైటీ) సభ్యుడు ఇమ్రాన్‌ సిద్దిక్, పుణేకు చెందిన రెస్క్యూ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement