కాంగ్రెస్ 2,948, బీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634 వార్డుల్లో పోటీ
14 మంది ఏకగ్రీవం
వీరిలో 12 మంది కాంగ్రెస్, మరో ఇద్దరు బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నెల 3న మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో వార్డులు, డివిజన్ల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే టీ పోల్ యాప్లో వివరాల నమోదు ఆలస్యం కావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు, 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు కలుపుకొని మొత్తం 2,996 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన వాటిని మినహాయించి మిగిలిన 2,982 స్థానాలకు మొత్తం 12,958 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

14 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వీరిలో 12 మంది మహిళలే కావడం గమనార్హం.12 చోట్ల కాంగ్రెస్, రెండింట బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


