పాలమూరు నుంచి బీజేపీ శంఖారావం | Nitin Nabin has started campaigning for the municipal elections | Sakshi
Sakshi News home page

పాలమూరు నుంచి బీజేపీ శంఖారావం

Feb 5 2026 4:27 AM | Updated on Feb 5 2026 4:27 AM

Nitin Nabin has started campaigning for the municipal elections

మున్సిపోల్స్‌ ప్రచారం ప్రారంభించిన నితిన్‌ నబీన్‌

మహబూబ్‌నగర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి కమలదళం పాలమూరు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ..జాతీయ నాయకత్వాన్ని కూడా  రంగంలోకి దింపింది. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కార్యకర్తల సమావేశాన్ని ‘విజయ సంకల్ప సమ్మేళనం’గా పేర్కొంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 

పార్టీ అధ్యక్షుడిగా తొలి సారిగా తెలంగాణకు వచ్చిన ఆయన.. మున్సిపోల్స్‌ సందర్భంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో అధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లను గెలవడంతో.. ప్రస్తుతం దక్షిణ తెలంగాణపైనా జాతీ య, రాష్ట్ర నాయకత్వాలు ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాయి. ఇందులో భాగంగానే మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 

గతంలోనూ పార్టీపరంగా అనేక కార్యక్రమాలను మహబూబ్‌నగర్‌ నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో...తెలంగాణ పోరుయాత్రను  కృష్ణానది తీరం నుంచి మొదలుపెట్టారు. గతంలో బండి సంజయ్‌ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఒక విడత పాద యాత్రను జోగుళాంబ ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఇక్కడి నుంచే శంఖారావం పూరించారు.

ఎంపీలకు అగ్నిపరీక్ష..: ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీ ఎంపీలకు అగ్నిపరీక్షగా మారనుంది. 8 మంది ఎంపీలున్న ప్రాంతాల్లో విజయాలపై వారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా పార్లమెంట్‌ సమావేశాల నుంచి కూడా మినహాయింపునిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మునిసిపాలిటీలన్నింటి లోనూ వారు గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో తమ పట్టు నిలుపుకో వాలంటే నియోజకవర్గాల్లో అత్యధిక స్థానా ల్లో గెలుపొందితేనే అదిసాధ్యమవుతుందన్న అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement