తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీకి బారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం కొట్టేసింది.
గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాల్లేవు. గ్రూప్-1 నియామకాలు సక్రమమే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం తుది తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తం 563 మంది అభ్యర్థులు ఇప్పటికే అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది.
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అలాగే..
గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తేల్చి చెప్పింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలక్ట్ అయిన అభ్యర్థులు మళ్లీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీంతో.. ఈ పిటిషన్లంటినీ కలిపి విచారణ జరిపింది సీజే నేతృత్వంలోని ధ్విససభ్య ధర్మాసనం.
వాదనలు ఇలా..
టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్కు, మెయిన్స్కు హాల్టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందని చెప్పారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు.
అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు.
ఇదిలా ఉంటే.. జనవరి 22నే తీర్పు వెల్లడి కావాల్సి ఉన్నా తీర్పు కాపీ రెడీ కాలేదని చెబుతూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ్టికి వాయిదా గమనార్హం.


