లక్నో: ఓ ఎస్యూవీ వాహనం టూవీలర్ను ఏడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో మహీంద్రా థార్ ఎస్యూవీ పెద్ద కలకలం రేపింది. పెట్రోల్ బంక్లో ఇంధనం నింపుకుని డబ్బులు చెల్లించకుండా థార్ యజమాని వాహనంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఉద్యోగి థార్ యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
వేగంగా వెళ్తున్న థార్ను వెంబడించాడు. తప్పించుకునేందుకు థార్ యజమాని సదరు పెట్రోల్ బంక్ ఉద్యోగి బైక్ను ఢీకొట్టాడు. ఆపకుండా ఏడుకిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.
ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థార్ యజమానికి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఎస్యూవీ బైక్ను లాగుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఘటన జరిగే సమయంలో మోటార్ సైకిల్ మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.


