మంచి మనతోనే మొదలవ్వాలి
● మైసూరు సమాజోత్సవంలో
యుక్తేశానందస్వామి
మైసూరు: ధర్మాన్ని ప్రబోధించడం కంటే జీవితంలో దానిని ఆచరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ రామకృష్ణ ఆశ్రమ అధిపతి స్వామి యుక్తేశానంద అన్నారు. ఆదివారం మైసూసులోని గాయత్రీపురంలో హిందూ సమాజోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆయన పాల్గొని మాట్లాడుతూ, వ్యక్తి– సమాజం అనేవి విడదీయరానివని, నేను మంచి వ్యక్తిని అయితే, సమాజం కూడా బాగుంటుందని చెప్పారు. నేను సరిగ్గా ప్రవర్తిస్తే, సమాజం కూడా సరిగ్గా ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకోవాలన్నారు. సంస్కరణ అనేది నా నుంచి, నా కుటుంబం నుంచి మొదలై సమాజాన్ని, దేశాన్ని చేసుకోవాలన్నారు. జీవితంలో పరివర్తన అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కులం పేరుతో సాగే సామాజిక వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని స్వామీజీ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి సంస్కృతీ, నీతి, నైతిక విలువలను పెంపొందించాలన్నారు. పర్యావరణం కోసం మొక్కలను, చెట్లను పరిరక్షిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. వలసవాద మనస్తత్వం నుంచి బయటపడి భారతీయ స్వభావాన్ని స్వీకరించి, జీవితంలోని అన్ని రంగాలలో స్వావలంబనకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల గుండా సమాజోత్సవ ర్యాలీ జరిగింది.
జనంపై వీధికుక్క దాడులు
తుమకూరు: జిల్లాలో కుక్కల దాడులు భయం పుట్టిస్తున్నాయి. కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా రంగప్ప (70), నారాయణప్ప (65), గుండప్ప (55), గంగాధర్ (44) అనేవారిని కలాసిపాల్య గ్రామ సమీపంలో ఓ కుక్క కరిచింది. దీంతో చికిత్స కోసం బెల్లూర్ క్రాస్లోని ఆది చుంచనగిరి ఆసుపత్రిలో చేరారు. కనిపించినవారినల్లా కరుస్తున్న వీధి కుక్కను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ పిడిఓకి ఫోన్ చేయగా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.
దొడ్డలో బాలునిపై
దొడ్డబళ్లాపురం: బాలునిపై వీధికుక్కలు దాడి చేసిన సంఘటన దొడ్డ పట్టణంలో జరిగింది. పాలన్జోగళ్లి పాండురంగ దేవాలయం వద్ద మంజునాథ్ కుమారుడు నిఖిత్ రాజ్ (6) ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా వచ్చిన సుమారు 15 వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో నిఖిత్ శరీరం మొత్తం గాయాలయ్యాయి. బాలుడిని తక్షణం దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉసురు తీసిన కట్న వేధింపులు
యశవంతపుర: కట్నం వేధింపులు తాళలేక వివాహిత యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లాలోని హెచ్ మైలళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. బేలూరు తాలూకా ఐ హుణసెకెరె కు చెందిన హెచ్.ఎల్.ఇంద్ర (24)కు నాలుగేళ్ల క్రితం హెచ్ మైలళ్లివాసి ఎంహెచ్ స్వామితో కట్న కానుకలిచ్చి వైభవంగా వివాహం జరిపించారు. వీరికి ఇంకా సంతానం లేదు. స్వామి బేకరీని నడిపేవాడు. నష్టాలు వచ్చాయని, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, పిల్లలు పుట్టలేదని భార్యను సతాయించేవాడు. శనివారం రాత్రి కూడా పెద్ద రగడ జరిగింది, దీంతో ఇంద్ర పురుగుల మందు తాగింది, దీంతో హాసన్ హిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయింది. భర్త, అత్తమామలపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంచి మనతోనే మొదలవ్వాలి
మంచి మనతోనే మొదలవ్వాలి


