సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు
కేంద్ర బడ్జెట్లో సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయించారు. ఇందులో అధిక భాగం ఆలిండియా రేడియో, ప్రసారభారతికి దక్కనుంది. మిగతా నిధులను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు, కమ్యూనిటీ రేడియో విస్తరణకు కేటాయించారు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు కేటాయించింది రూ.6,103.02 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
ఈ దఫా సమాచార, ప్రసార శాఖకు ఇచ్చిన రూ.4,551 కోట్లలో ప్రసారభారతికి రూ.2,291.88 కోట్లను ప్రత్యేకించారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్లు తదితరాల కోసం ఖర్చు పెడతారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.250 కోట్లను వెచ్చిస్తారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ, కొత్త చిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణానికి రూ.344.55 కోట్లను, ఎఫ్ఎం ప్రసారాలతో ఆలిండియా రేడియో నెట్వర్క్ విస్తరణ, డీటీహెచ్ సామర్థ్యం పెంపు వంటి వాటికి రూ.509.24 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్లో మాదిరిగానే ఈసారి కూడా నిరక్షరాస్యుల కోసం కమ్యూనిటీ రేడియో కార్య క్రమాల నిమిత్తం రూ.8 కోట్లు కేటాయించారు. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్(ఏవీజీసీ) రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు దేశవ్యాప్తంగా 15 వేల సెకండరీ స్కూళ్లు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల కోసం రూ.250 కోట్లు కేటాయించారు.
పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ89.97 కోట్లు, కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్కు రూ.80 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్కు రూ.83 కోట్లు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రూ.11.22 కోట్లు, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.35 కోట్లు వేర్వేరుగా కేటాయింపులు జరిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సామాజిక సేవల రంగానికి బడ్జెట్లో మరో రూ.111.22 కోట్లను కేటాయించారు.
ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!


