మైనార్టీ షేర్హోల్డర్ల ప్రయోజనాలపై ఫోకస్
ప్రమోటర్లు దుర్వినియోగం చేయకుండా కట్టడి
మైనారిటీ షేర్హోల్డర్ల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రమోటర్లు ట్యాక్స్ ఆర్బిట్రేజ్ పొందకుండా నివారించేలా షేర్ల బైబ్యాక్లకు సంబంధించిన ట్యాక్సేషన్ నిబంధనలను బడ్జెట్లో సవరించారు. అన్ని కేటగిరీల షేర్హోల్డర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్నులు వేసేలా ప్రతిపాదించారు. ప్రమోటర్లపై అదనంగా బైబ్యాక్ ట్యాక్స్ని ప్రస్తావించారు. దీనితో కార్పొరేట్ ప్రమోటర్లకు ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 22 శాతానికి, నాన్–కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతానికి పెరిగినట్లవుతుంది.
బైబ్యాక్ మార్గాన్ని ప్రమోటర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టడానికి దీన్ని ఉద్దేశించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రమోటర్లపై అధిక పన్నుల భారం మోపడం వల్ల డివిడెండ్లు, బైబ్యాక్లకు జరిపే కేటాయింపుల విషయంలో కంపెనీలు తమ వ్యూహాలపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. షేర్హోల్డర్ల నుంచి సొంత షేర్లను కొనుగోలు చేసే కంపెనీలపై విధించే ట్యాక్స్ని మార్కెట్ పరిభాషలో బైబ్యాక్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. కంపెనీలు తమకొచ్చిన లాభాలను వాటాదార్లకు డివిడెండ్ రూపంలో చెల్లించడానికి బదులు, ఇలా షేర్ల బైబ్యాక్ కోసం వెచ్చించడాన్ని నివారించేందుకు ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తుంది.
పన్ను భారం 30 శాతం (అత్యధిక శ్లాబ్ రేటు) నుంచి క్యాపిటల్ గెయిన్స్ రేట్ల స్థాయికి తగ్గడం వల్ల (స్వల్పకాలానికి 20 శాతం, దీర్ఘకాలానికి 12.5 శాతం) ఇండివిడ్యువల్ షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హోల్టైమ్ డైరెక్టర్ రూప్ భూత్రా తెలిపారు. అదే సమయంలో కార్పొరేట్లకు ఇది ప్రతికూలంగా ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీలు మిగులు నిధులను బైబ్యాక్ల కోసం వెచ్చించడాన్ని నివారించి, మూలధన పెట్టుబడులు, పరిశోధన కార్యకలాపాల వైపు మళ్లించేందుకు దోహదపడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: ‘ఛాంపియన్ల’ కోసం మూడంచెల వ్యూహం


