ఫ్యూచర్స్‌ ట్రేడర్లపై ఎస్‌టీటీ గూగ్లీ | Securities Transaction Taxes for derivatives on futures and options trade increased | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్స్‌ ట్రేడర్లపై ఎస్‌టీటీ గూగ్లీ

Feb 2 2026 5:04 AM | Updated on Feb 2 2026 5:04 AM

Securities Transaction Taxes for derivatives on futures and options trade increased

 ఫ్యూచర్స్‌పై 150 శాతం పెంపు 

ఆప్షన్స్‌పై 50 శాతం అప్‌ 

బీఎస్‌ఈ, బ్రోకరేజ్‌ స్టాక్స్‌ డౌన్‌

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్‌ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో)పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ని (ఎస్‌టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్‌పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్‌టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

అలాగే ఆప్షన్స్‌ ప్రీమియంపై, ఆప్షన్స్‌ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్‌టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్‌ ఈక్విటీ మార్కెట్‌పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్‌ ఉంటున్న డెరివేటివ్‌ ట్రేడింగ్‌నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్‌ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. 

అతి స్పెక్యులేటివ్‌ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్‌ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్‌ విక్రయంపై ఎస్‌టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్‌ కాంట్రాక్ట్‌ విక్రయంపై ఎస్‌టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్‌ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం లెమన్‌ సహ వ్యవస్థాపకుడు ఆశీష్‌ సింఘాల్‌ తెలిపారు. 

 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్‌ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్‌ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్‌ అనంతరం కాన్ఫరెన్స్‌లో నిర్మలా సీతారామన్‌ వివరించారు.  

మార్కెట్లు డౌన్‌.. 
ఎస్‌టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్‌ సంబంధ స్టాక్స్‌ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ఎంసీఎక్స్‌ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్‌), ఏంజెల్‌ వన్‌ స్టాక్‌ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్‌ఎల్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్‌ రాఠీ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి.  

ఎఫ్‌పీఐలకు ప్రతికూలం.. 
సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్‌ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్‌ ఫండ్స్‌కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్‌ ఈక్విటీ బ్రోకింగ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆకాశ్‌ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్‌పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్‌ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్‌ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. 

ఫండమెంటల్స్‌ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్‌పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్‌ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్‌టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎండీ శ్రీపాల్‌ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్‌ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. 
 

ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్‌ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్‌ ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్లను ఎస్‌టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో పీఎంఎస్‌ సహ–వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్‌ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్‌ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement