ఈడీ సోదాలకు సీఎం మమతా బెనర్జీ అడ్డుతగలడం అవాంఛనీయం
ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాల్సిందే
కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేం
ప్రామాణిక కార్యాచరణ నియమావళి రూపొందించాలి
ఐప్యాక్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది.
జనవరి 8న కోల్కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా, మమతా బెనర్జీ అక్కడకి దూసుకొచ్చారు. సోదాలకు అడ్డు తగలడంతోపాటు అక్కడున్న ల్యాప్టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంంతంగా లాక్కొని వెళ్లిపోయా రు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసు గా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
‘‘ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే’’ అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత, అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని రూపొందించాలని తేలి్చచెప్పింది. ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదావేసింది.


