న్యూఢిల్లీ: పాకిస్తాన్లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ధ్వజమెత్తారు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తముందనే ఆరోపణలను జైశ్వాల్ ఖండించారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
పాకిస్తాన్కు అసత్య ఆరోపణలు చేయడం తప్పితే వేరే పని లేనట్లు ఉందని చురకలంటించారు. ముందు పాకిస్తాన్ అసత్య ప్రేలాపన వదిలి ఆ దేశ ప్రజల దీర్ఘ కాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితే బాగుంటందన్నారు.
పాకిస్తాన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారరహితమైనవి. ఇది పాకిస్తాన్ తరచూ ఉపయోగించే పద్ధతి – తన అంతర్గత వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడమే. ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసంబద్ధమైన ఆరోపణలు చేయడం బదులు, పాకిస్తాన్ తన ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను తీర్చడంపై దృష్టి పెట్టాలి. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, క్రూరత్వం అంతర్జాతీయంగా బాగా తెలిసిన విషయాలు.
కాగా, పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా, వాటి బాధ్యతను భారత్పై మోపడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యాఖ్యలు, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఆరోపణలను ఎదుర్కొనే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్ ఏడాది కాలంగా బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు.. పాక్పై దాడికి తిగుతున్నారు. ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్యలను మరింత స్పష్టంగా చూపిస్తోంది.
బలోచిస్తాన్లో ఇటీవల జరిగిన దాడుల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఈ దాడులకు భారత్ కారణమని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆరోపించారు. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని భారత్పై నెట్టే యత్నం చేసింది.
దీన్ని భారత్ ఖండిస్తూ.. వారి దేశంలో సమస్యలను వేరే దేశంపై మోపడం పాక్కు బాగా అలవాటుగా మారిపోయిందని భారత్ స్ట్రాంగ్గా బదులిచ్చింది.


