రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026–27) కేంద్ర సర్కారు రూ.17.2 లక్షల కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి నిధులను వినియోగించనుంది. 2025–26 సంవత్సరానికి స్థూల రుణ సమీకరణ అంచనా రూ.14.80 లక్షల కోట్లుగా ఉంది.
‘ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల రూపంలో రూ.11.7 లక్షల కోట్లు నికర రుణ సమీకరణ చేయనున్నాం. మిగిలిన రుణాలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇతర రూపాల్లో ఉంటాయి. స్థూల రుణ సమీకరణ రూ.17.2 లక్షల కోట్లుగా ఉంటుంది’ అని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.5.5 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని, అందుకే రుణ సమీకరణ నంబర్ పెద్దగా కనిపిస్తోందని ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్ వివరించారు.
ద్రవ్య నిర్వహణ విషయమై రాష్ట్రాలతోనూ మాట్లాడుతున్నామని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో భాగంగా మంత్రి సీతారామన్ తెలిపారు. ఆర్టికల్ 293 (3) కింద రాష్ట్రాల రుణాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. పరిమితికి మించి రుణ సమీకరణను అడ్డుకోవడం లేదంటూ.. ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్రాలు తమ బాధ్యతను అర్థం చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: క్యాపిటల్ గెయిన్స్గా షేర్ల బైబ్యాక్


