ప్రపంచ శాంతికి ట్రంప్‌ నాయకత్వం అవసరం | Modi Praise Trump After Tariffs Cut On India | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతికి ట్రంప్‌ నాయకత్వం అవసరం

Feb 3 2026 6:56 AM | Updated on Feb 3 2026 10:37 AM

Modi Praise Trump After Tariffs Cut On India

భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. 

అమెరికా వాణిజ్య విషయంలో భారత్‌ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్‌ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్‌ తన సోషల్‌ ట్రూత్‌లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని కూడా ట్రంప్‌ తన సోషల్‌ మీడియా సోషల్‌ ట్రూత్‌లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.

మోదీ ఏమన్నారంటే..
ట్రంప్‌ ఫోన్‌కాల్‌.. సోషల్‌ మీడియా పోస్ట్‌ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్‌ పూర్తిగా సహకరిస్తుంది.. 

.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అయితే ట్రంప్‌ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం!  

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్

ఇక ట్రంప్‌ ఏమన్నారంటే.. 
‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌర­వం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమ­ల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్‌ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్‌ హర్షం వెలిబుచ్చారు. 

నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్‌ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్‌ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్‌ అన్నారు.  

అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్‌.. ట్రంప్‌-మోదీ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్‌, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్‌ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్‌పై అమెరికా తుది టారిఫ్‌లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement