భోజ్‌శాలలో పూజలు, నమాజ్‌కు ఓకే  | Supreme Court Allows Hindu, Muslim Friday Prayers | Sakshi
Sakshi News home page

భోజ్‌శాలలో పూజలు, నమాజ్‌కు ఓకే 

Jan 22 2026 1:08 PM | Updated on Jan 23 2026 6:21 AM

Supreme Court Allows Hindu, Muslim Friday Prayers

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా హిందువులకు అనుమతి  

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల దాకా నమాజ్‌కు అంగీకారం  

ఇరువర్గాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి  

శాంతి భద్రతల పరిరణక్షకు చర్యలు తీసుకోవాలి  

అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు  

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల–కమల్‌ మౌలా సమీదు వద్ద పూజల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి రోజు(శుక్రవారం) హిందువులు అక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల దాకా నమాజ్‌ చేసుకోవచ్చని సూచించింది. 

ముస్లిం వర్గం నుంచి నమాజ్‌లో పాల్గొనేవారి పేర్ల జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయాలని ఆ వర్గాన్ని ఆదేశించింది. భోజ్‌శాల కాంప్లెక్స్‌ వద్ద పూజలు, ప్రార్థనలు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించుకుంటామని హిందువులు విజ్ఞప్తిచేశారు. 

ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వినతిని మన్నించింది. పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సూచించింది. ‘‘భోజ్‌శాల కాంపౌండ్‌లో వద్ద నమాజ్‌కు ఎంతమంది హాజరవుతారో తెలుసుకొని దాన్నిబట్టి ప్రత్యేక స్థలం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో వారు అక్కడ నమాజ్‌ చేసుకోవచ్చు. 

అలాగే హిందువులు సంప్రదాయ పూజలు చేసుకోవడానికి అక్కడ ప్రత్యేక స్థలం కేటాయించాలి. హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు, ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నమాజ్‌ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి వీల్లేదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పూజలు, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. సందర్శకులకు ఉచితంగా పాసులు మంజూరు చేసే అంశం పరిశీలించాలి’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.  

ఏమిటీ భోజ్‌శాల?  
11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇది వాగ్దేవి(సరస్వతి) మందిరంగా కొలుస్తుంటారు. భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) ఈ కట్టడాన్ని పరిరక్షిస్తోంది. మరోవైపు ముస్లింలకు కూడా ఇది పవిత్రమైనదే. దశాబ్దాల క్రితమే కమల్‌ మౌలా మసీదుగా ప్రకటించారు. నిత్యం నమాజ్‌ చేస్తుంటారు. 2003 ఏప్రిల్‌ 7న ఏఎస్‌ఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. భోజ్‌శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు శుక్రవారం నమాజ్‌ చేసుకోవాలి. ఈసారి వసంత పంచమి శుక్రవారం రావడంతో సందిగ్ధత నెలకొంది. పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లింలు యథాతథంగా నమాజ్‌ చేసుకోవడానికి అనుమతించాలంటూ మసీ దు కమిటీ పిటిషన్‌ దాఖలు చేసింది.  
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు  
భోజ్‌శాల–కమల్‌ మౌలా మసీదు వద్ద ఒకేరోజు పూజలు, నమాజ్‌ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ జవాన్లు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ముస్లిం వర్గం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు కమల్‌ మౌలా నమాజ్‌ ఇంతెజామియా కమిటీ చీఫ్‌ జులీ్ఫకర్‌ పఠాన్‌ చెప్పారు. శుక్రవారం శాంతియుతంగా నమాజ్‌ చేసుకోవాలని ముస్లింలను కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగి్వజయ్‌ సింగ్‌ స్వాగతించారు.  

ఇది కూడా చదవండి: karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement