క్రికెట్ ప్రపంచంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లకు ఉన్న ఆదరణ వేరు. ఏ స్థాయిలోనైనా చిరకాల ప్రత్యర్థుల పోరుకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వీరాభిమానులకు ఆదివారం (ఫిబ్రవరి 15) పండుగే. వారి కోసం భారత్- పాక్ మ్యాచ్ డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో
ఓ వైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ శ్రీలంక వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్- సల్మాన్ ఆఘా బృందంతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో కూడా ఈ రెండు జట్ల మధ్య నేడు (ఆదివారం) పోరు జరగనుంది.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరంభం
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్ మొదలు అవుతుంది. బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక. కాగా మహిళ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి.
అగ్రస్థానంలో పాక్
ఇక గ్రూప్-బి నుంచి ఆతిథ్య థాయ్లాండ్, బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, మలేషియా జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్-లో తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ నేపాల్పై 30 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు.. భారత్-ఎ జట్టు మాత్రం అనూహ్య రీతిలో పసికూన యూఏఈ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
రాధ యాదవ్ కెప్టెన్సీలో
ఫలితంగా గ్రూప్-ఎలో ప్రస్తుతానికి పాక్, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్, నేపాల్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత మహిళల సీనియర్ జట్టు సభ్యురాలైన రాధ యాదవ్ కెప్టెన్సీలో భారత్-ఎ జట్టు ఈ టీ20 టోర్నీ బరిలో దిగింది. మన మహిళల బృందంలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మవంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్టార్లు కూడా ఉన్నారు.
ఎక్కడ చూడాలంటే?
ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్- పాక్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రసారం కానుండగా.. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్ టీవీ నెట్వర్క్, సోనీ లివ్ ఇండియాలో వీక్షించవచ్చు.
చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు


