టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది.
అయితే ఈ హైవోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజూ శాంసన్పై వేటు పడనుంది.
గత మ్యాచ్లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
నమీబియాతో మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్ సింగ్ లేదా రింకూ సింగ్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టే అవకాశముంది. పాక్పై కుల్దీప్ యాదవ్కు అద్భుతమైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.
పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్/అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా


