టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి దాయాది జట్టుకు మరోసారి ఓటమి రుచిని చూపించాలని భారత్ పట్టుదలతో ఉంది.
అయితే పాక్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉండడంతో భారత్కు జట్టుకు గట్టి పోటీ ఎదురు కానుంది అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత టీమ్ మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా గురువారం(ఫిబ్రవరి 12) నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ, అర్ష్దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
"నమీబియాతో మ్యాచ్లో భారత బౌలర్లందరూ వికెట్లు తీశారు. అర్ష్దీప్ ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో మూడు ఓవర్లు మాత్రమే కెప్టెన్ బౌలింగ్ చేయించాడు. శివమ్ దూబే సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ను రొటేట్ చేసిన విధానం చూస్తుంటే పాక్ మ్యాచ్ కోసం ఒక ప్రణాళికతో ఉన్నట్లు కన్పిస్తోంది. పాక్తో మ్యాచ్కు అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. అందుకేనేమో నమీబియాతో మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్కు బదులుగా పాండ్యాతో మొదటి ఓవర్ను బౌలింగ్ వేయించాడు. అదేవిధంగా శ్రీలంక పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తాయి. భారత్ గతంలోనూ ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడింది. కాబట్టి కుల్దీప్ను జట్టులోకి తీసుకోవడం మేలు" అని గవాస్కర్ 'స్టార్ స్పోర్ట్స్' డిబేట్లో పేర్కొన్నాడు.
చదవండి: Vaibhav Suryavanshi: క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ


