బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్ స్టేడియం కొత్త స్టాండ్లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కేఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆయన నేతృత్వంలో కమిటీ భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్ను ఏర్పాటు చేస్తారు. అనిల్ కుంబ్లే కేఎస్సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.


