చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్ మిజుకి ఒయ్కావా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్లు కోల్పోయినప్పటికీ స్నేహిత్ పట్టు
వదలకుండా పోరాడాడు.
వరుసగా మూడు గేమ్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్లో స్నేహిత్ 8–10తో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.


