కోర్బా: ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.
పాట పాడుతూ..
2018లో తన లివ్-ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్పుత్ తెలిపారు.
ఆ రోజు ఏం జరిగింది?
మధుర్ సాహు జిమ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కోమల్ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది" అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.
నమ్మించేలా ప్లాన్..
హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్ సింగ్ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.
రోడ్డుకింద ఆస్థి పంజరం..
హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.
తుది దశలో విచారణ
ప్రభుత్వ న్యాయవాది సునీల్ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది.


