ఆ సిద్ధాంతం ఉన్న చోట అభివృద్ధి నిల్
హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
రాయ్పూర్: కమ్యూనిస్ట్ సిద్ధాంతంపై హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతం వినాశకరమైందంటూ మండిపడ్డారు. కమ్యూనిజం ఉన్న చోట అభివృద్ధి మచ్చుకైనా కనిపించదన్నారు. అందుకే, ఆ భావజాలం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని కోరారు. వామపక్ష తీవ్రవాదంపై ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్ట్ భావజాలం మనజాలదు. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టుల పాలన ముగిసింది. కేరళలో వారి ప్రభుత్వం చివరి ఊపిరి పీలుస్తోంది’’ అన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగానో, అభివృద్ధి లోపంగానో చూడరాదని షా చెప్పారు. ‘‘ఇది సిద్ధాంతపరమైన సవాలు. వామపక్ష తీవ్రవాదం పెరగకమునుపు బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిస్థితి యూపీ, బిహార్ కంటే మెరుగ్గా ఉండేవి. మరో పదేళ్లలో బస్తర్ దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనుంది’’ అన్నారు.
మార్చి ఆఖరుకు అంతం
‘‘దేశంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం 90 శాతం మేర తగ్గిపోయింది. మార్చి చివరికల్లా దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం’’ అని అమిత్ షా నొక్కి చెప్పారు. ‘‘ఛత్తీస్గఢ్లో వందల సంఖ్యలో నక్సలైట్లు హతమయ్యారు. వేలాది మంది లొంగిపోయారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. లొంగిపోయిన వారిని ప్రభుత్వం రెడ్ కార్పెట్తో ఆహ్వానిస్తుంది’’ అన్నారు. ప్రభుత్వం ఒక్క తూటా కూడా కాల్చాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.


