అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో సాకారం
పీయూష్ గోయల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: సుంకాల గుదిబండ నెత్తి నుంచి పక్కకు పడిపోవడంతో ఇకపై నిరభ్యంతరంగా అమెరికా వస్తూత్పత్తులను కొనుగోలుచేయొచ్చని, వాటిని ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశలో భాగంగా ఫ్రేమ్వర్క్పై శనివారం ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరిన నేపథ్యంలో గోయల్ ఆదివారం ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘సుంకాలు భారీగా దిగొచి్చన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులను పెద్దమొత్తంలో కొనుగోలుచేయడం పెద్ద విషయమేమీ కాదు.
రాబోయే సంవత్సరాల్లో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలిన ఆశపడుతున్న భారత్కు కేవలం 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు పెద్ద సమస్యే కాదు. ముడి చమురు, ద్రవరూప సహజ వాయువు తదితరాలకుతోడు ఒక్క వైమానికరంగం నుంచే 100 బిలియన్ డాలర్ల స్థాయిలో దిగుమతులు అవసరం రావొచ్చు’’అని అన్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమానాల విడిభాగాలు, భూ అయస్కాంతాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్లకు సంబంధించి ఏటా మొత్తంగా 500 బిలియన్ డాలర్ల స్థాయిలో దిగుమతులు చేసుకుంటామని సంయుక్త ప్రకటనలో భారత్ ఆసక్తికనబర్చిన నేపథ్యంలో గోయల్ తదనుగుణంగా స్పందిండం గమనార్హం.
గణనీయ మార్కెట్ అవకాశాలు..
‘‘చైనా, ఇతర కంపెనీల ఉత్పత్తులపై అమెరికా అధిక టారిఫ్లు విధిస్తోంది. భారతీయ ఉత్పత్తులపై గతంలో 50 శాతం టారిఫ్ అమల్లో ఉండగా ఇకపై కేవలం 18 శాతం అమల్లోకిరానుంది. ఈ లెక్కన ఆయా దేశాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులకు అమెరికాలో మార్కెట్ అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి 300 బిలియన్ డాలర్ల స్థాయిలో జరుగుతున్న దిగుమతులు ఇకపై అమెరికా నుంచి రాబోతున్నాయి.
ప్రస్తుతం కీలక దేశాలన్నింటి నుంచీ దిగుమతులు జరుగుతున్నాయి. ఇవి వచ్చే ఐదేళ్లలో 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగే ఆస్కారముంది. భారత ఆర్థికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సెమీ కండక్టర్ చిప్లు మొదలు అత్యాధునిక మెషీనరీ, డేటా సెంటర్ల ఉపకరణాలు, విమానాలు, విమానాల విడిభాగాలు, ఇంధన రంగ సరకులకు డిమాండ్ పెరగనుంది. భారత్లో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లుగా సరసమైన ధరలకు మాకు సరకులను దిగుమతి చేస్తే బాగుంటుందని అమెరికా వాణిజ్య శాఖాధికారులకు ఇదివరకే సూచించాం’’అని గోయల్ వెల్లడించారు.
ఎంత సరఫరా చేసినా తీసుకుంటాం..
‘‘ఎన్నో రంగాల్లో భారత్కు అమెరికా ఉత్పత్తుల అవసరం ఉంది. ఎంత సరఫరా చేసినా తీసుకుంటాం. మనకు 10 గిగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్లు రావొచ్చు. వాటికి సంబంధించిన విడిభాగాలు అమెరికా సరఫరా చేయొచ్చు. విమానాలు, విమాన ఇంజిన్లు అవసరమే. ఇప్పటికే ఒక్క బోయింగ్ నుంచే 50 బిలియన్ డాలర్ల ఆర్డర్లు కోరాం. వచ్చే ఐదేళ్లలో ఇది 80–90 బిలియన్ డాలర్లకు పెరగొచ్చు. టాటా కంపెనీ నుంచి మరిన్ని ఆర్డర్లు రావొచ్చు. ఉక్కు రంగంలో అవసరాల కోసం కోకింగ్ కోల్ కావాలి. ఏటా దాదాపు 18 బిలియన్ టన్నుల స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై ఏటా 30 బిలియన్ డాలర్లస్థాయిలో కోల్ కావాలి. ఈ వాణిజ్య ఒప్పందం అంతిమంగా మన రైతులకే ప్రయోజనం చేకూరుస్తుంది. సాగు, మత్స్యరంగ ఉత్పత్తుల ఎగుమతి భారీగా పెరగనున్నాయి’’అని గోయల్ అన్నారు.


