ఉక్రెయిన్, రష్యాలకు అమెరికా అల్టిమేటం
త్వరలో అమెరికాలో త్రైపాక్షిక చర్చలు
డోన్బాస్పై నిర్ణయం మారదు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టీకరణ
కీవ్: నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి జూన్కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ముగింపు పలకాలని రష్యా–ఉక్రెయిన్లకు అమెరికా గడువు విధించింది. అప్పటివరకు శాంతి ఒప్పందం కుదరాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో రెండు దేశాలను దారికి తెచ్చేందుకు తగు రీతిలో ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం కీవ్లో మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. ‘వచ్చే జూన్ కల్లా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా గట్టిగా కోరుతోంది.
ఈ షెడ్యూల్ ప్రకారం యుద్ధం ఆగిపోయేలా రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘యుద్ధాన్ని నిలువరించేందుకు అమెరికా పక్కాగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందుకోసం కాల్పుల విరమణ, సైన్యాల ఉపసంహరణ, శాంతి ఒప్పందం వంటివి అన్నీ జూన్నాటికి పూర్తయిపోవాలని కోరుకుంటోంది’అని ఆయన వివరించారు.
‘అదేవిధంగా, తదుపరి త్రైపాక్షిక చర్చలు వచ్చే వారం మియామీలో జరుపుతామంటూ అమెరికా ప్రతిపాదన పంపించింది. అందుకు, మేం సిద్ధంగా ఉన్నామని బదులిచ్చాం’అని తెలిపారు. ఇటీవల అబూధాబిలో జరిగిన త్రైపాక్షిక చర్చల సందర్భంగా రష్యా ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ అమెరికాకు 12 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక ప్రతిపాదనలను అందజేశారని జెలెన్స్కీ చెప్పారు. చర్చల్లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కూడా ఒక భాగంగా ఉన్నాయన్నారు.
యధాతథ పరిస్థితి ఉండాలన్నాం
అబుధాబిలో గత వారం జరిగిన త్రైపాక్షిక చర్చల సందర్భంగా ‘మేం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం’అని ప్రతిపాదించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ప్రస్తుతం ఏ దేశ సైన్యం ఏ స్థానాల్లో ఉందో, అక్కడితో యుద్ధాన్ని ఆపేయడం దీనర్థమని వివరించారు. పారిశ్రామికంగా అత్యంత కీలకంగా ఉన్న డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా గట్టిగా కోరడంపై స్పందిస్తూ...డోన్బాస్ విషయంలో సార్వ భౌమాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
‘డోన్బాస్ను స్వేచ్ఛాయుత ఆర్థిక మండలి(ఎఫ్ఈజెడ్)గా మార్చాలని అమెరికా ప్రతిపాదించింది. తద్వారా ఈ ప్రాంతంలో రష్యా, ఉక్రెయిన్ లు రెండూ వ్యాపారం చేసుకోవచ్చు. అయితే, రష్యా ఆక్రమించాలనుకుంటున్న ప్రాంతంలో ఇలాంటిది ఆచరణ సాధ్యం కాదు’అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న అతిపెద్ద జపొరిఝియా అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎటువంటి ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదన్నారు. యుద్ధం ఆపిన తర్వా త, రెండు దేశాలు కాల్పుల విరమణను పాటించేలా పర్యవేక్షణ బాధ్యతల్లో కీలకంగా ఉంటామని అమెరికా హామీ ఇచ్చిందని జెలెన్స్కీ చెప్పారు.
ఉక్రెయిన్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం
రష్యా ఆర్మీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 400కు పైగా డ్రోన్లు, మరో 40 క్షిపణులను ఉక్రెయిన్ ఇంధన మౌలిక వనరులే లక్ష్యంగా ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు. ‘దీని ఫలితంగా విద్యుత్ గ్రిడ్ దెబ్బతింది. విద్యుదుత్పత్తి కేంద్రాలు మూతబడ్డాయి. సరఫరా వ్యవస్థలు ధ్వంసమయ్యాయి’అని ఆయన అన్నారు. రష్యా భారీ దాడుల కారణంగా దేశంలోని 8 ప్రాంతాల్లో ఉన్న 8 అణు విద్యుత్ ప్లాంట్లు మూతబడ్డాయని ఉక్రెయిన్ విద్యుత్ సంస్థ ఉక్రెనెర్గో ప్రకటించింది. అన్ని ప్రాంతాల్లోనూ గంటల వారీగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నామని తెలిపింది.


