మధ్యంతర ఒప్పందానికి సై  | interim trade agreement on india and usa | Sakshi
Sakshi News home page

మధ్యంతర ఒప్పందానికి సై 

Feb 8 2026 4:44 AM | Updated on Feb 8 2026 4:44 AM

interim trade agreement on india and usa

వాణిజ్యంపై భారత్, అమెరికాల మధ్య ఫ్రేమ్‌వర్క్‌ ఖరారు

భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు 

18 శాతానికి తగ్గిస్తామన్న అమెరికా  

25 శాతం ప్రతీకార సుంకాలు రద్దు.. వెంటనే అమల్లోకి  

కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం  

రష్యా నుంచి మళ్లీ చమురు కొంటే సుంకాల మోత తప్పదని స్పష్టీకరణ  

మధ్యంతర ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులపై టారిఫ్‌లు రద్దు లేదా తగ్గింపు  

30 ట్రిలియన్‌ డాలర్ల అమెరికా మార్కెట్‌లో భారత ఎగుమతిదారులకు ప్రవేశం 

భారత పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం  

ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామన్న భారత్, అమెరికా  

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ:  భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు తీపి కబురు అందింది. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 

ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. మధ్యంతర ఒప్పందంలో భాగంగా వాటిని 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు గత ఏడాది ఆగస్టులో విధించిన 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. 

25 శాతం అదనపు సుంకాలను శనివారం నుంచే రద్దు చేస్తున్నట్లు అమెరికా తేలి్చచెప్పింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను భారత్‌ కొంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ తన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉంటామని భారత్‌ అంగీకరించిందని పేర్కొన్నారు.  

వచ్చే నెలలో సంతకాలు!  
ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగినట్లు ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు పేర్కొన్నాయి. తద్వారా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని, పరిశ్రమలకు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశాయి. ఇది పరస్పరం ఇచి్చపుచ్చుకొనే, ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఒప్పందమని అభివరి్ణంచాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది తొలిదశ అని ఉద్ఘాటించాయి.

 పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను మరింత వేగవంతం చేస్తామని తెలిపాయి. మధ్యంతర ఒప్పందం వల్ల అమెరికాలో 30 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మార్కెట్‌ భారత ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేసింది. మధ్యంతర ఒప్పందంపై వచ్చే నెల రెండో వారంలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామని భారత్, అమెరికా ప్రకటించాయి.  

భారత్, రష్యాల చమురు వాణిజ్యంపై నిఘా  
అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను రద్దు చేశామని, మరికొన్నింటిపై తగ్గించామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పశువుల దాణాగా ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్,  శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్‌ ఆయిల్, వైన్, స్పిరిట్స్, మద్యం తయారీలో వాడే ధాన్యాల వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. 

అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విమాన విడిభాగాలు, అరుదైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్‌ కోల్‌ వంటివి దిగుమతి చేసుకోబోతున్నట్లు స్పష్టంచేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేస్తుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగే చమురు కొంటున్నట్లు తేలితే భారత్‌పై మరోసారి 25 శాతం అదనపు సుంకాలు విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు ఉంటాయని కార్యనిర్వాహక ఉత్తర్వులో తేలి్చచెప్పడం గమనార్హం. భారత్, రష్యాల మధ్య చమురు వాణిజ్యంపై నిఘా వేస్తామని అమెరికా సర్కార్‌ వెల్లడించింది.  

అతిపెద్ద మార్కెట్‌ అమెరికా  
మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ అంబాసిడర్‌ జెమీసన్‌ గగ్రీర్‌ హర్షం వ్యక్తంచేశారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, దానివల్ల తమ పరిశ్రమలు, కారి్మకులకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్‌తో ఈ ఒప్పందం విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఇండియాపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం అదనపు సుంకాలు విధించింది.

 మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు. భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్‌ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్‌ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఇక ఊపందుకోనున్నాయి. భారత జనరిక్‌ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్‌లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది.  

మనకు భారీ ప్రయోజనం 
→ 44 బిలియన్‌ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు  
→ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి  

అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టంచేశారు. మన దేశం నుంచి 44 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవని తెలిపారు. సున్నా టారిఫ్‌లు అమలవుతాయని అన్నారు. శనివారం ఒప్పందం ఖరారైన తర్వాత పీయూష్‌ గోయల్‌ స్పందించారు. లేబర్‌ ఇంటెన్సివ్‌ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. 

2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పారదర్శకమైన, సమతూకంతో కూడిన ఒప్పందానికి వచ్చామని స్పష్టంచేశారు. మన జనరిక్‌ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్‌ వర్తిస్తుందన్నారు. 30 ట్రిలియన్‌ డాలర్ల అమెరికా మార్కెట్‌ మనకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. 

మనదేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్‌ డెకార్, స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని తేలి్చచెప్పారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పీయూష్‌ గోయల్‌ వివరించారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మరింత ఊపు వస్తుందన్నారు.  

ముఖ్యాంశాలు 
→ భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోతాయి.  
→ భారత ఎగుమతిదారుల కోసం 30 ట్రిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌లోకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ), రైతులకు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది.  
→ ఎగుమతులు పెరిగితే సహజంగానే పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. దానివల్ల యువతకు, మహిళలకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  
→ ఎగుమతులపై ఆధారపడిన భారత్‌లోని ముఖ్యమైన రంగాలకు మేలు జరుగుతుంది.  
→ సెక్షన్‌ 232 కింద విమాన విడిభాగాలపై భారత్‌కు కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆటో విడిభాగాలపై టారిఫ్‌ రేట్‌ కోటా అమలు చేస్తామని తెలిపింది.  
→ అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది.  
→ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్‌–టారిఫ్‌ అవరోధాలను, డిజిటల్‌ ట్రేడ్‌ అవరోధాలను పరిష్కరించుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి.  
→ గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు సహా టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించాయి.  

అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు నో రిలీఫ్‌  
తమ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టలేమని, అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించబోమని భారత్‌ తేల్చేసింది. అమెరికా నుంచి వచ్చే ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అమెరికా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయాలు, మాంసంపై సుంకాలు యథాతథంగా వసూలు చేస్తామని, మినహాయింపులేవీ ఉండవని పేర్కొంది. 

భారత్‌లో కోట్లాది మంది రైతులు వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే అవి చౌకగా వచి్చపడే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రైతులు నష్టపోవడం ఖాయం. ఇతర దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో మన రైతులు ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి రంగాలే వెన్నెముక అనడం అతిశయోక్తి కాదు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ బలోపేతం: మోదీ
న్యూఢిల్లీ:  అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ బలోపేతం కావడం తథ్యమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో మనకు నూతన అవకాశాలు వస్తాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు మోదీ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతం కోసం వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర ఒప్పందం రెండు దేశాలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. 

భారత్, అమెరికాల భాగస్వామ్యంలో లోతైన విశ్వాసానికి ఇదొక ప్రతీక అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. సప్లై చెయిన్లకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రపంచానికి సైతం ఆర్థికంగా మేలు జరుగుతుందని మోదీ వివరించారు. మన ప్రజల సాధికారత, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement