అమెరికా, ఈయూలతో వాణిజ్య ఒడంబడికలు అలాగే సాధ్యమయ్యాయి
మలేసియాలో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
కౌలాలంపూర్: అగ్రరాజ్యం అమెరికా మొదలు యురోపియన్ యూనియన్ దాకా ముఖ్యదేశాలు, కీలక కూటములతో భారత్ బలమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక అంతకంటే బలమైన విశ్వాసం దాగి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కౌలాలంపూర్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి భారతీయసంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘‘బ్రిటన్, అమెరికా, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, న్యూజిలాండ్ మొదలు ఈయూదాకా అన్ని దేశాలు భారత్ను విశ్వసనీయమైన అభివృద్ధి భాగస్వామిగా చూశాయి. అందుకే భారత్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ భారత రూపాయి కంటే భారత్ అనే విశ్వసనీయతే బలమైన కరెన్సీగా ఎదిగింది. ఇక మలేసియా విషయానికొస్తే ఇక్కడ 30 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
ఈ లెక్కన అత్యధిక మంది భారతీయులున్న రెండో అతిపెద్ద దేశంగా మలేసియా అవతరించింది. ఇది ఇరుదేశవాసుల మదులను దోచుకుంటోంది. ఇదొక్కటే కాదు మలేసియాలో సర్వసాధారణంగా ఆరగించే రోటీ కనాయ్, మలబార్ పరోటా, కొబ్బరితోపాటు సుగంధ ద్రవ్యాలు, వేడివేడి తేహ్ టరీక్ టీ.. కౌలాలంపూర్లో అయినా కొచి్చలో అయినా ఒకేలా గుబాళిస్తాయి. తమిళనాడు మూలాలున్న వ్యక్తులు మలేసియాలో చాలా ఎక్కువగా ఉన్నారు’’అని అన్నారు.
ప్రధానికి ఎంజీఆర్ పాటలంటే ఇష్టం
‘‘మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, నేనూ ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. మలేసియా ప్రధాని పీఠంపై అధిరోహించకముందే ఈయన నాకు తెలుసు. ఈయనకు రాజకీయ చతురతే కాదు పాటలు పాడటంలోనూ ప్రావీణ్యం ఉంది. ఇటీవలే ఆయన ఓ పాట కూడా పాడారు. ఆయనకు తమిళ దిగ్గజం ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాటలంటే ఎంతో ఇష్టం. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్.మురుగన్ కూడా తమిళులే. మలేసియాలో శతాబ్దాలుగా తమిళులు స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు.
ఈ చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మలయ విశ్వవిద్యాలయ తిరువల్లువార్ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటుచేసుకోవడం మనకు గర్వకారణంగా ఉంది. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనను మలేసియాతో మొదలెట్టడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయంగా భారత్ విజయం సాధించిందంటే మలేసియా సైతం గెలిచిట్లే. ఆ లెక్కన ఆసియా గెలుపొందినట్లే. ఇరుదేశాల అభివృద్ధి దిశాపదం ఇంపాక్ట్(ఇండియా మలేసియా పార్ట్నర్షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్ఫార్మేషన్–ఐఎంపీఏసీటీ)’’అని మోదీ అభివరి్ణంచారు.
మోదీకి ఘన స్వాగతం
అంతకుముందు ఢిల్లీ నుంచి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి మలేసియా ప్రధాని ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. ఎర్రతివాచీ పరచి స్వయంగా ఎదురొచ్చి ఆలింగనం చేసుకున్నారు.


