యువతి తల్లిని బెదిరించిన వివాహితుడు
ఉరివేసుకొని తల్లీబిడ్డ ఆత్మహత్య
మండ్య(కర్ణాటక_): పిల్లను ఇచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తానని ఓ వివాహితుడు బెదిరింపులకు పాల్పడటంతో భయపడిన తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈఘటన మండ్య జిల్లా మలవళ్లి తాలూకా హలగురు సమీపంలోని దళవాయి కోడిహళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో ఎం. మహేష్ శకుంతల (37), కుమార్తె ప్రియ (18) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పక్కింటిలో ఉంటున్న ముత్తురాజు అనే వివాహితుడు మహేష్ కుమార్తె ప్రియపై కన్నేశాడు.
కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లిచేయాలని శకుంతలపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించలేదు. ప్రియను వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తురాజ్ శకుంతలకు ఫోన్ చేసి ప్రియకు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో తల్లీబిడ్డ తమ ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రియ తండ్రి మహేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


