సర్పంచ్‌ పదవి కోసం కన్న కూతురునే కడతేర్చి.. | Sarpanch Election Scandal incident in Nizamabad | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ పదవి కోసం కన్న కూతురునే కడతేర్చి..

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

Sarpanch Election Scandal incident in Nizamabad

ఎన్నికల్లో పోటీకి అడ్డుగా ఉన్న ముగ్గురు పిల్లల నిబంధన 

నిందితుడు మహారాష్ట్ర వాసి, కేసును ఛేదించిన బోధన్‌ పోలీసులు

నిజామాబాదు జిల్లా: మహారాష్ట్రలో మరో ఆరు నెలల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేయాలనుకున్నాడు. అందుకు ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా నిలవడంతో కన్నబిడ్డనే హతమార్చిన ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ సాయి చైతన్య సోమవారం ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... జనవరి 29న ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్‌ గ్రామ పరిధిలో గల నిజాంసాగర్‌ డి–46/8 కెనాల్లో గుర్తు తెలియని ఆరేళ్ల బాలిక మృత దేహం కనిపించింది.

 స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బాలిక వివరాల కోసం మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు బృందంలో ఒకరైన కానిస్టేబుల్‌ సు«దీర్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌లో బాలిక మృత దేహం ఫొటో పెట్టాడు. ఈ వాట్సాప్‌ స్టేటస్‌ చూసిన మహారాష్ట్ర ప్రాంతంలోని ముఖేడ్‌కు చెందిన ఆయన బంధువులు ఫోన్‌ చేసి బాలిక వివరాలు తెలిపారు. ముఖేడ్‌ పట్టణ కేంద్రానికి చెందిన బాలిక పేరు ప్రాచి కొండమంగలే అని చెప్పారు. ముఖేడ్‌కు వెళ్లిన పోలీసుల బృందం విచారణలో బాలికను కన్న తండ్రే హతమార్చిన విషయం తెలిసింది. 

బోధన్‌ రెవెన్యూ డివిజన్‌కు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముఖేడ్‌ తాలూకా కెరుర్‌ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాండురంగ ముఖేడ్‌లో విరాట్‌ సెలూన్‌ పేరిట షాపు పెట్టి క్షౌ ర వృత్తి చేస్తున్నాడు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్‌ గ్రామ సర్పంచ్‌ పదవికి పోటీ చేయాలని భావించాడు. ఈ విషయాన్ని అప్పుడప్పుడూ సెలూన్‌కు వచ్చే ప్రస్తుత కెరుర్‌ గ్రామ సర్పంచ్‌ గణేశ్‌ షిండేకు తెలిపాడు. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హుడవుతావని గణేశ్‌ చెప్పడంతో, పాండురంగ తన ముగ్గురు పిల్లల్లోని బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయతి్నంచాడు. పుట్టిన తేదీని మార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

చివరికి ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్టు అందరికీ చెప్పాలని పాండురంగ, గణేశ్‌ కలిసి ప్లాన్‌ చేశారు. అనంతరం పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచికి నిజామాబాద్‌ వెళ్దామని మాయ మాటలు చెప్పాడు. మోటార్‌ బైక్‌పై తీసుకొచ్చి మార్గ మధ్యలో ఎడపల్లి మండలం నిజాంసాగర్‌ కెనాల్‌ నీటిలో తోసేశాడు. ఈ కేసులో పాండురంగ, గణేశ్‌లను అరెస్టు చేశామని, మోటార్‌ బైక్, మూడు మొబైల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్టు సీపీ సాయి చైతన్య తెలిపారు. బాలిక హత్య కేసును ఛేదించిన రూరల్‌ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, రెంజల్‌ ఎస్సై చంద్రమోహన్, ఏఎస్‌ఐ బాబూరావు, కానిస్టేబుల్స్‌ సు«దీర్, శ్రీకాంత్‌లను సీపీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement