సమాజ మార్పుతోనే దేశాభివృద్ధి సాధ్యం
సమాజంలో గుణాత్మక మార్పు రాకుంటే దేశానికి ప్రమాదం
వందేళ్ల సంఘ్ యాత్ర–కొత్త ఆశయాల కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
వెయ్యి మంది మేధావులు, సినీరంగ ప్రముఖులతో భేటీ
సంస్థ ఆశయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధి బాధ్యత కొన్ని సంస్థలదో లేదా ప్రజల కోసం పాటుపడే కొందరు వ్యక్తులదోనని చాలా మంది భావిస్తుంటారని.. కానీ వారి ఆలోచన సరైంది కాదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆరెస్సెస్) సర్సంఘ్ చాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చి సమాజం స్వీయ అభివృద్ధి చెందేలా స్ఫూర్తినింపడమే తమ సంస్థ పని అని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, గొప్ప వ్యక్తులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని.. సమాజమే స్వీయ గురువని అన్నారు. సమాజంలో ఐకమత్యం, గుణాత్మక మార్పు వచ్చే వరకు దేశ భవిష్యత్తు మారదని పేర్కొన్నారు.
అది మారకుంటే దేశం ప్రమాదంలో పడినట్లేనని ఆయన హెచ్చరించారు. ఆరెస్సెస్ శత జయంతి వేడుకల్లో భాగంగా ‘వందేళ్ల సంఘ్ యాత్ర–కొత్త ఆశయాలు’అనే అంశంపై హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వెయ్యి మంది మేధావులను ఉద్దేశించి మోహన్ భాగవత్ మాట్లాడారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలని ఉద్బోధించడమే తమ సంస్థ పని అని చెప్పారు. వ్యక్తి నుంచి వ్యవస్థ దాకా దేశం సమగ్రాభివృద్ధి చెందేందుకు ఐదు మార్పులను కుటుంబ ప్రబోదం (భజన, భోజనం, భాష, భూష, భవనం, భ్రమణం), పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యత, స్వదేశీయత, పౌరవిధులు అనే ఐదు మార్పుల గురించి మోహన్ భాగవత్ పరిచయం చేశారు.
ఆర్ఎస్ఎస్లో భాగమైతేనే సంస్థను అర్థం చేసుకోగలరు..
ఆర్ఎస్ఎస్ గురించి పైపైన తెలుసుకొనే వారు దాని గురించి పొరబడే ప్రమాదం కూడా ఉంటుందని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. సంస్థలో భాగమై అనుభవం పొందడం ద్వారానే ఆర్ఎస్ఎస్ గురించి, అది చేపడుతున్న కార్యకలాపాల గురించి ఎవరైనా లోతుగా తెలుసుకోగలుగుతారని చెప్పారు. ‘సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. ఇదే ముఖ్యమైన పని. దీనిమీదే ఆర్ఎస్ఎస్ ధ్యాస పెడుతుంది. ఈ పని తప్ప మరో పని చేయాల్సిన అవసరం సంఘ్కు లేదు’అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
ఎన్నో సేవలు..
‘ఆర్ఎస్ఎస్లోని స్వయంసేవకులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఆర్ఎస్ఎస్ సేవా సంస్థ కాదు. సైన్యం తరహాలో ఎంతో క్రమశిక్షణతో స్వయం సేవకులు పథ్ సంచాలన్ చేపడతారు.. అంతమాత్రాన మాది పారామిలిటరీ సంస్థ కాదు. నిత్య శాఖలో భాగంగా లాఠీ శిక్షణ లాంటివి ఇస్తాం. కానీ ఇదేమీ శారీరక సౌష్టవం కోసం శిక్షణ ఇచ్చే అఖాడా కాదు. అలాగే సంస్థలో ఉమ్మడి, వ్యక్తిగత గీతాలాపనతోపాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ మాది సంగీత సంస్థ కాదు. కేవలం ఇలాంటి బాహ్య అంశాలనుబట్టి ఆర్ఎస్ఎస్ను ఎవరైనా అర్థం చేసుకుంటే పొరబడతారు. కళారంగం మొదలు రాజకీయ రంగం వరకు అన్ని రంగాల్లోనూ స్వయంసేవకులు ఉన్నారు.
కొందరు స్వయంగా ఆయా రంగాలను నడుపుతుంటే మరికొందరు ఎప్పటి నుంచో ఉన్న రంగాల్లో భాగస్వాములై నేడు అగ్రపథాన నిలిచారు. వారిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ నియంత్రించదు. వారు పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంటారు’అని మోహన్ భాగవత్ వివరించారు. హిందూ సమాజంలో ప్రస్తుతం హిందువులమని చెప్పుకోవడానికి గర్వించేవాళ్లు.. హిందువులమని కేవలం ప్రైవేటుగానే అంగీకరించేవాళ్లు.. హిందువులుగా జీవిస్తున్నా బహిరంగంగా ప్రకటించుకోని వాళ్లు.. హిందువుల మూలాలను పూర్తిగా మర్చిపోయిన వాళ్లు ఉన్నారన్నారు. హిందువులంతా ఒకే సంస్కృతికి చెందినవారైనప్పటికీ అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందన్నారు. ఈ సందర్భంగా సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
సినీ ప్రముఖులతోనూ భేటీ..
అంతకుముందు సీనియర్ బ్యూరోక్రాట్లు, సినీరంగ ప్రముఖులతో సమావేశమైన సందర్భంగా ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం, లక్ష్యం, ఆశయాల గురించి మోహన్ భాగవత్ తెలియజేశారు. దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సమాజ పరివర్తన జరగాలని.. అందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న ప్రముఖులు, ఆదర్శ వ్యక్తులు స్వీయ ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు.


