మార్చి 10లోగా దాఖలు చేయాలని నిర్ణయం
నిందితుల సంఖ్య పెరిగే అవకాశం.. అరెస్టులు మాత్రం ముగిసినట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ సైతం పూర్తి కావడంతో అభియోగపత్రాల తయారీ ప్రారంభించారు. మరోవైపు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మార్చి 10న మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆలోగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. తుది చార్జ్షిట్లో కొన్ని సెక్షన్లతోపాటు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక అరెస్టులు ఉండవని.. నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం.
అలా నమోదై... ఇలా మారి...
ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆపై 2023 మార్చి 13న ప్రణీత్రావు అరెస్టు తర్వాత దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు.
అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది.
అందరి వేళ్లూ ఆ అధికారుల వైపే...
ట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు.
మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల్ని ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్తో పాటు ప్రభాకర్రావు, రాధాకిషన్రావుల ఎక్స్టెన్ వివరాలు ఆరా తీశారు. అవన్నీ పోలీసు విభాగం నిర్ణయాలని పేర్కొన్నారు. ఇలా అన్ని వేళ్లూ అప్పట్లో పని చేసిన ఉన్నతాధికారుల వైపే వెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు వారి విచారణపై సిట్ నిర్ణయం తీసుకోలేదు. వారిని ప్రశ్నించకుంటే కోర్టు విచారణలో కేసుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


